: ఆంధ్రా ఎంపీలకు షాకిచ్చిన రైల్వే బోర్డు చైర్మన్.. ఏపీకి రైల్వే జోన్ ఎందుకని ప్రశ్న

విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ షాకిచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖ వచ్చిన ఆయనను కలుసుకున్న ఎంపీలు రైల్వే జోన్ గురించి ప్రశ్నించారు. స్పందించిన మిట్టల్ రైల్వేలు అన్ని వసతులు కల్పిస్తున్నప్పుడు ఏపీకి ప్రత్యేకంగా రైల్వేజోన్ ఎందుకని ప్రశ్నించడంతో ఎంపీలు బిత్తరపోయారు. తర్వాత మిట్టల్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ అనేది రాజకీయ నిర్ణయమని, అది తమ చేతుల్లో లేదని ఎంపీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల రెండు దశాబ్దాల కల అని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. విశాఖ-ఢిల్లీ మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాలు అనుకూలంగా లేవని, రైలు వేగం కూడా పెంచాలని హరిబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాల్తేరు డివిజన్‌కు కేంద్రం రూ.690 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క పనీ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లకు సంబంధించి పలు సమస్యలను మిట్టల్ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.

More Telugu News