: నేను జోలపాట పాడతానంటే చాలు... మా పిల్లలు ఇట్టే నిద్రపోయేవారు!: నటి శ్రీదేవి

నాటి అందాల తార, సీనియర్ నటి శ్రీదేవి నటిస్తున్న చిత్రం ‘మామ్’. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సారేగామాపా లిటిల్ ఛాంప్స్’ సీజన్-6 కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, ‘మా పిల్లలు జాహ్నవి, ఖుషీలు చిన్నప్పుడు నిద్రకు ఉపక్రమించే సమయంలో నేను పిట్ట కథలు చెబుదామనుకున్నప్పుడు వాళ్లు నిద్రపోయేవాళ్లు కాదు. కానీ, జోలపాట పాడటం మొదలు పెట్టగానే దెబ్బకు నిద్రపోయేవారు. ఎందుకంటే, నా గొంతు అంత భయంకరంగా వుంటుంది మరి! దీంతో, నేను పాడేందుకు వాళ్లు ఇష్టపడేవారు కాదు’ అని చెప్పింది.

తన పిల్లలు ఇద్దరూ చాలా సెన్సిబుల్ అని, ఒక తల్లి లా కంటే ఓ ఫ్రెండ్ లాగానే వారితో ఉంటానని చెప్పింది. అంతేకాదు, తన పిల్లలు జంక్ ఫుడ్స్ తినేందుకు ఇష్టపడరని, జంక్ ఫుడ్ తినమని వారికి తాను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని, అయినా, వాళ్లు తినేవారు కాదని శ్రీదేవి చెప్పుకొచ్చింది. కాగా, జీ టీవీలో ప్రసారమయ్యే ‘సారేగామాపా లిటిల్ ఛాంప్స్’ సీజన్-6 ఈ నెల 14న మదర్స్ డే సందర్భంగా ప్రసారం కానుంది.

More Telugu News