: బ్రేక్‌ఫాస్ట్‌కి దూరంగా ఉంటున్నారా?.. అయితే తీవ్ర సమస్యలు తప్పవంటున్న పరిశోధకులు

ఉద‌యం బాగా తిని రాత్రిపూట మాత్రం కొద్దిగానే ఆహారం తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. తాజాగా హార్వర్డ్‌ యూనివర్శిటీ చేసిన ప‌రిశోధ‌న‌లో ఆ సూచ‌న స‌రైందేన‌ని తేలింది. 46,289 మందిని తీసుకుని బ్రేక్ ఫాస్ట్ చేసే అల‌వాటు ఉన్న‌వారు, లేని వారిపై పరిశోధన చేయ‌గా బ్రేక్ ఫాస్ట్‌ మిస్సయ్యే వారు ఆరోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసింది. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవ‌డం అనేది చాలా ముఖ్యమైనదని ప‌రిశోధ‌కులు తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేయని వారిలో జీవక్రియ దెబ్బతింటుందని, క‌డుపులో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.

బ్రేక్‌ఫాస్ట్‌ తినే వారితో పోల్చి చూస్తే అది చేయ‌ని వారిలో హైపర్‌టెన్షన్ ఉంటుంద‌ని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింద‌ని, టైప్‌-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే బరువు కూడా పెరుగుతారని తెలిపారు. బ్రేక్ ఫాస్ట్ తిన‌క‌పోతే ఎనర్జీ లెవల్స్‌ తగ్గిపోతాయని, శరీరంపై దుష్ప్రభావం అధికంగా ఉంటుందని, తలనొప్పి కూడా వస్తుందని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్ స‌రిగా చేయ‌ని వారి వెంట్రుకల్లోని కెరోటిన్‌లో సమస్యలు తలెత్తి జుట్టు రాలే స‌మ‌స్య కూడా వెంటాడుతుంద‌ని చెప్పారు.

More Telugu News