: మనిషి కాలిపోతుంటే ఫొటోలు, వీడియోలు తీస్తూ నిలబడ్డ వైనం!

మనుషుల్లో మాన‌వ‌త్వం మంట క‌లుస్తోంద‌న్న చేదు నిజం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. క‌ళ్ల‌ముందు తోటి మ‌నిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా సాయం చేయాల‌ని కూడా అనిపించ‌డంలేదు కొంద‌రికి. ఈ సంఘటన అటువంటిదే. మహారాష్ట్రలోని బీద్‌ జిల్లా ప్రధాన జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని, ఒక బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ధాటికి మరో బైక్‌ నుంచి మంటలు చెలరేగడంతో ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి తలకి తీవ్రమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. త‌న‌ శరీరం కాలిపోతున్నా సాయం చేయ‌మ‌ని అడ‌గ‌లేని ప‌రిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న అనంత‌రం అత‌డి చుట్టూ చేరిన స్థానికులు, మంటల్లో కాలిపోతోన్న ఆ వ్య‌క్తిని చూస్తూ ఉండిపోయారు. అంతేకాదు, మంట‌ల్లో కాలిపోతోన్న ఆ వ్యక్తిని సినిమా చూస్తున్నట్లు చూస్తూ.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో ఆ వ్య‌క్తి స‌జీవద‌హ‌నం అయ్యాడు. ఇంత‌లో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ బైక్‌ల‌లో ఒకరు మద్యం సీసాలు తీసుకెళ్తూ ఉండొచ్చని, దీంతో ప్రమాదం కాగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

More Telugu News