: ట్రంప్ చెప్పేది వినాల్సిన అవసరం ఉంది.. ఆయన ట్వీట్లను ఆపలేం: ట్విట్టర్
అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లను ఆపే ప్రసక్తే లేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు చేసే ట్వీట్లు చాలా ముఖ్యమైనవని... ఆయన చెప్పాలనుకుంటున్న దానిని వినడం ఎంతో ముఖ్యమని చెప్పారు. ట్వీట్ చేయకుండా ఆయనను ఆపాలని ఎవరూ భావించకూడదని అన్నారు. విల్లీ గీస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈవిధంగా స్పందించారు.
మన దేశాధినేత అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవడం మనకు ఎంతో అవసరమనే విషయాన్ని తాను నమ్ముతున్నానని చెప్పారు. తలుపులు మూసిన గదిలో మాట్లాడుకోవడం కన్నా... బహిరంగంగా చర్చించుకోవడమే మేలని తాను భావిస్తున్నానని తెలిపారు. ట్విట్టర్ యూజర్లు 328 మిలియన్లకు పెరగడానికి కారణం ట్రంప్ ట్వీట్లేనని చెప్పారు. ట్రంప్ ట్వీట్లు కొన్నిసార్లు నొచ్చుకునే విధంగా ఉన్నప్పటికీ... అవన్నీ మన మంచికేనని తెలిపారు. ట్వీట్ చేయకుండా ట్రంప్ ను ఆపలేమని స్పష్టం చేశారు.