: పేదల ఇళ్లు తగులబడిపోతుంటే...సెల్ఫీ దిగిన బీజేపీ ఎమ్మెల్యే

రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని బయానా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిరుపేదల గుడిసెలు తగులబడిపోతుంటే...అగ్నిమాపక సిబ్బంది ఆ సమాచారాన్ని పోలీసులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి, బీజేపీ ఎమ్మెల్యే బచ్చు సింగ్ కు కూడా ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలికి హుటాహుటీన వచ్చారు.

 అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగా, ఎమ్మెల్యే బాధితులను ఆదుకుంటామని చెప్పి...మంటలు కనిపించేలా సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఓపక్క ఇల్లు కాలుతుంటే ఆ అగ్గితో చుట్టవెలిగించుకున్నాడన్న సామెత గుర్తుకొస్తోందని ఒక నెటిజన్ మండిపడగా, ఏ సమయంలో సెల్ఫీ దిగాలో కూడా ప్రజాప్రతినిధికి తెలియదా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ పోస్టును తొలగించారు. 

More Telugu News