: అమెరికాకు ఉత్తరకొరియా స్ట్రాంగ్ వార్నింగ్

ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాను బెదిరించాలని ప్రపంచంలోని ఏ దేశమూ ప్రయత్నించదు. ఉత్తరకొరియా మాత్రం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేస్తోంది. ఇంతవరకు అమెరికా బెదిరింపులకు సమాధానం మాత్రమే చెప్పుకొచ్చిన ఉత్తర కొరియా తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటన వివరాల్లోకి వెళ్తే... ‘ఇటీవల మేము నిర్వహించిన డ్రిల్‌ యుద్ధానికి ప్రారంభం లాంటిది. అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది. యుద్ధం జరిగితే.. కోట్ల మంది అమెరికన్లు అణుదాడిలో మరణిస్తారు. ఆ దేశ స్వరూపమే మారిపోతుంది. అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్‌ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణకొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది’ అని సూచించింది.

అదే సమయంలో ఉత్తరకొరియాలోని ఒక మీడియా సంస్థ ‘యుద్ధ వినాశనం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాకు ఒకే ఒక్క దారి ఉంది. దక్షిణకొరియా నుంచి వారి మిలిటరీని, ప్రజలను స్వదేశానికి తీసుకెళ్లాలి’ అని స్పష్టంగా తెలిపింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థను ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ రకమైన హెచ్చరికలు చేయడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

More Telugu News