: ఉద్యోగులకు హెచ్చరిక! మరో మూడేళ్లలో ఊడనున్న కోటి ఉద్యోగాలు!

వచ్చే మూడునాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల వల్ల 2020 నాటికి చాలా ఉద్యోగాలు మాయం అవుతాయని హెచ్చరించింది. నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్పుడు సంధి దశకు చేరుకుందని వివరించింది. నైపుణ్యాలను పెంచుకుంటే తప్ప ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం కష్టమని పలువురు నిపుణులు, అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఒకటి పోతే రెండు.. అన్నట్టుగా ఉద్యోగావకాశాలు ఉండేవని, కానీ ఇకపై అలాంటి ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, ప్రముఖ  సంస్థల అంచనా ప్రకారం వచ్చేమూడు నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నిజానికి వాటి స్థానంలో రెండు కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉండగా కేవలం 30-50 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని, మిగిలిన వారు రోడ్డున పడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలు పనికిరాకుండా పోతాయి కాబట్టి కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.
 
పింక్ స్లిప్‌ల బారి నుంచి తప్పించుకోవాలంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు అడాప్టివ్ థింకింగ్, డేటా ఇంటెలిజెన్స్, సంక్లిష్ట సమస్యల పరిష్కార నైపుణ్యంపై పట్టుపెంచుకోవాలని సూచిస్తున్నారు. అవి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, లేకుంటే అంతేనని హెచ్చరిస్తున్నారు.

More Telugu News