: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక రైల్వే టికెట్లు ఇంటికే వస్తాయి!

ఇకపై రైల్వే టిక్కెట్లను డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది. టిక్కెట్లను డోర్ డెలివరీ ద్వారా అందుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదు చెల్లించవచ్చు. కాగా, ఐఆర్సీటీసీ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే వినియోగదారులు డోర్ డెలివరీ సదుపాయాన్ని పొందాలంటే, మొబైల్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఐఆర్సీటీసీ అకౌంట్లు ఉన్నవారు ఈ సేవను సంబంధిత సైట్ లోకి వెళ్లి ఉపయోగించుకోవచ్చు.

ప్రూఫ్ కింద పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసే సమయంలో పే ఆన్ డెలివరీ (పీఓడీ) అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్టు డోర్ డెలివరీ అయిన తర్వాత సదరు ప్రయాణికుడు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ పద్ధతిలో రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేస్తే అదనంగా కొంత రుసుము వసూలు చేస్తారు. రూ.5 వేల లోపు కొనుగోలుకు రూ.90 వరకు, రూ.5వేలకు పైబడితే రూ.120 చార్జీ కింద వసూలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా, ప్రయాణికులు తమ ప్రయాణానికి గరిష్టంగా ఐదు రోజుల ముందుగా కూడా ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది. ఈ విధానంలో బుక్ చేసిన టిక్కెట్లను ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.. ఆ టిక్కెట్లు డోర్ డెలివరీ అయ్యేలోగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను, క్యాన్సిలేషన్, డోర్ డెలివరీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, పీవోడీ విధానం ప్రస్తుతం మన దేశంలో ఆరువందల నగరాలు, పట్టణాల్లో అమల్లో ఉంది.

More Telugu News