: నా దగ్గర జయలలిత రాసిన వీలునామా ఉంది.. ఆస్తులు మావే!: మేనల్లుడు దీపక్ సంచలన ప్రకటన

అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు న్యాయస్థానం విధించిన జరిమానాను తీరుస్తానని ప్రకటించిన ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తన అత్త, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని అన్నారు. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో పలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌ బంగ్లాలో హత్య, దోపిడీ జరిగాయి.

ఈ సందర్భంగా జయలలిత ఆస్తుల వివరాలు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని, అందుకే అక్కడ హత్య, దోపిడీ చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వినబడుతుండగా, కేవలం డబ్బు కోసమే ఆ దోపిడీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మా అత్త జయలలిత రాసిన వీలునామా నా దగ్గరే ఉంది. అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయి’ అంటూ జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌ చేసిన ప్రకటన తమిళనాడులో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ వీలునామా ప్రకారం చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌ లోని రెండు కార్యాలయాలు, సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్‌, హైదరాబాద్‌ లోని ద్రాక్షతోట తదితర ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ వెల్లడించారు.

More Telugu News