: షాకింగ్... చిప్స్ ప్యాకెట్ కోసం తలాక్ చెప్పేశాడు!

ముస్లిం సంప్రదాయంలో భాగమైన ట్రిపుల్ తలాక్ ఎంత దుర్వినియోగమవుతోందో తెలిపే ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కేవలం చిప్స్ ప్యాకెట్ కోసం తలాక్ చెప్పేసిన ఘటన ముస్లిం మహిళల పట్ల ఉన్న చులకన భావనకు దర్పనం పడుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్ జిల్లాలోని కవినగర్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ముస్లిం మహిళ పుట్టింటి పక్కన ఉండే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారి దాంపత్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తన భర్త ఇటీవల రెండు చిప్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు. వాటిలో ఒకదానిని పక్కనే ఉన్న తన తల్లిదండ్రులకు ఆ మహిళ ఇచ్చింది. అదే పెద్దనేరమైపోయింది. చిప్స్ ప్యాకెట్ ఎందుకిచ్చావంటూ ఘర్షణకు దిగిన భర్త, ఆమెను కొట్టడమే కాకుండా ట్రిపుల్ తలాక్ చెప్పి, మెట్టింటి నుంచి పుట్టింటికి గెంటేశాడు. దీంతో ఆ మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ యూపీ మంత్రి అతుల్‌ గార్గ్‌ ను ఆశ్రయించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి  వచ్చింది. దీని గురించి విన్నవారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చిప్స్ ప్యాకెట్ కోసం విడాకులా? అని ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News