: మధ్యాహ్నం 2 గంటలకు ఖాళీగా ఉండండి... బాంబులాంటి వార్త చెబుతాం: ఆప్!

తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ ఉదయం సమావేశమై, మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాంబు లాంటి వార్తను వెల్లడిస్తామని చెప్పారు. నిరాధారమైన ఆరోపణల కారణంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని ఆప్ ఐటీ అండ్ ఇన్నోవేషన్ సెల్ అధ్యక్షుడు అంకిత్ లాల్, నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఇప్పుడొస్తున్న వార్తల కన్నా పెద్ద వార్త వెలువడుతుందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

దీనిపై వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అందిస్తామని, ఆ సమయానికి ఖాళీగా ఉండాలని అన్నారు. కాగా, తనపై ఆరోపణలు వచ్చిన తరువాత రెండు రోజులు మౌనం పాటించిన కేజ్రీవాల్ సైతం స్పందిస్తూ, నిజం నిగ్గుతేలుతుందని, ఢిల్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నామని అన్నారు. జీఎస్టీకి సంబంధించిన ఓ బిల్లుకు ఆమోదం కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలిచినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

More Telugu News