: విమానాశ్రయంలో తాగి వీరంగమేసిన గుజరాత్ డిప్యూటీ సీఎం కుమారుడు

గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జైమన్ పటేల్ (30) పూటుగా మద్యం తాగి వీరంగమేసిన ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... భార్య ఝలక్, కుమార్తె వైష్వితో కలిసి గ్రీస్ వెళ్లేందుకు జైమన్ పటేల్ ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నారు. వీల్ చెయిర్‌ లో కూర్చున్న జైమన్ పటేల్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు కూడా పూర్తి చేయించుకున్నారు.

ఆయన పూటుగా మద్యం తాగడంతో కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో, ఆయనను వీల్‌ చెయిర్‌ లో కూర్చోబెట్టారని సమాచారం. అప్పటికీ దుర్వాసన వస్తుండడంతో విమానంలో ఆయనను ఎక్కించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన వారితో వాదనకు దిగారు. డిప్యూటీ సీఎం కొడుకునే ఆపుతారా? అంటూ వీరంగంవేసి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం గుజరాత్ లో కలకలం రేపడంతో... దీనిపై నితిన్ పటేల్ వివరణ ఇస్తూ...తన కుమారుడు అనారోగ్యం కారణంగా నడవలేక వీల్‌ చెయిర్‌ లో కూర్చున్నాడని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రత్యర్ధులు అర్థం పర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

More Telugu News