: ఆ డైలాగ్ తోనే.. వేటూరి గారు నన్ను పలకరించేవారు: ఎల్ బీ శ్రీరామ్

సీనియర్ నటుడు, రచయిత ఎల్.బి.శ్రీరామ్ తన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. సుమారు ఇరవై ఐదేళ్ల క్రితం విడుదలైన 'అప్పుల అప్పారావు' చిత్రానికి తాను మాటల రచయితగా పని చేశానని చెబుతూ, ఈ సందర్భంగా ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

‘ఈ సినిమా షూటింగ్ విజయవాడలోని ఓ పెద్ద హాల్లో జరుగుతోంది. ఓ పక్కన కూర్చుని  నేను డైలాగ్స్ రాసుకుంటున్నా. ‘అప్పే చేయనోడు గాడిద..’ అనే పాటను వేటూరి గారు రాస్తున్నారు. ఆ సమయంలో, సినీ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ అయిన బాబూరావు అనే ఆయన, వేటూరి గారికి నన్ను పరిచయం చేశాడు. ‘నాటకరంగం నుంచి వచ్చాడు.. కొత్త కొత్త పద ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి డైలాగ్ ‘అప్పు’డే తెల్లారిందా’ అని వేటూరి గారికి చెప్పాడు. ఆ తర్వాత వేటూరి గారు ఎప్పుడు కనపడినా ‘ ‘అప్పు’డే తెల్లారిందా, బాగున్నారా’ అని పలకరించేవారు. వేటూరి గారు ఇలా అంటున్నారని నేనే వేరే వాళ్లకి చెప్పాను. వాళ్లన్నారు.. అది నీ డైలాగ్ గొప్పతనం కాదు.. అది ఆయన పర్సనల్ బాధ. అందుకనే, ఆయన ఈ డైలాగ్ కు కనెక్ట్ అయిపోయారు అంటూ చెప్పారు’ అని ఎల్.బి.శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

More Telugu News