: కొత్త పార్టీ పెడుతున్న బాబాయ్.. ఆయన వర్గీయులపై వేటు వేసిన అబ్బాయ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ అంతర్గత కుమ్ములాటలు ఆగిపోలేదు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ కు అత్యంత సన్నిహితులైన ఆరుగురిపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వేటు వేశారు. వేటుకు గురైన వారిలో కల్లు యాదవ్, మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, రాకేష్ యాదవ్, రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రకటించింది. మరోవైపు 'సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా' పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు శివపాల్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాయం సింగ్ నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, అఖిలేష్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అఖిలేష్ మాట్లాడుతూ, స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు ఎవరో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

More Telugu News