: హైదరాబాద్ లో తొలిసారి... ఇంపల్షన్ టెక్నాలజీతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చేస్తున్న జీహెచ్ఎంసీ... లైవ్ ఇచ్చేందుకు టీవీ చానల్స్ పోటీ!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ అధికారులు కావూరి హిల్స్ లోని బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మించిన ఐదంస్తుల భారీ భవంతిని నేడు కూల్చనున్నారు. నగర చరిత్రలో భవనాల కూల్చివేతకు ఇన్నాళ్లూ కార్మిక శక్తినే వినియోగిస్తూ వచ్చిన అధికారులు, తొలిసారిగా ఇంపల్షన్ అడ్వాన్డ్స్ వైబ్రేషన్ టెక్నాలజీని తొలిసారిగా వినియోగిస్తుండటం విశేషం.

భవనాల కూల్చివేతకు వాడే అత్యుత్తమ సాంకేతిక పద్ధతిగా భావించే ఇంపల్షన్ విధానంలో పునాదులు, మధ్యలో పిల్లర్లకు హోల్స్ చేసి ప్లాస్టిక్ ఎక్స్ ప్లోజివ్స్ వాడతారు. వాటిని ఒకేసారి పేల్చడం ద్వారా భవనాన్ని కూలుస్తారు. హైదరాబాద్ లో తొలిసారిగా ఈ విధానాన్ని వాడుతుండటంతో భవంతి కూల్చివేతను పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు, చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటల తరువాత భవంతిని పేల్చనుండగా, దీన్ని లైవ్ లో అందించేందుకు దాదాపు అన్ని టీవీ న్యూస్ చానళ్లూ పోటీ పడుతున్నాయి.

More Telugu News