: ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటి వార్డ్ రోబ్ లో మహిళ మృతదేహం

బెంగళూరులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటి వార్డ్ రోబ్ లో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులోని గాంధీ నగర్ లోని శాటిలైట్ టౌన్ లో నవీన్ అనే వ్యక్తిని గత ఏడాది ఏప్రిల్ నెలలో అద్దెకు ఇల్లు కావాలంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సంప్రదించాడు. దీంతో అతనికి నవీన్ తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. మే నెల నుంచి ఆ ఇంట్లో సదరు ఇంజనీరింగ్ విద్యార్థి తన తల్లి, అమ్మమ్మలతో ఉంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇల్లు ఖాళీ చేశాడు.

అయితే అతను ఖాళీ చేసినప్పుడు తాను బిజీగా ఉండడంతో నవీన్ ఇంటిని సరిచూసుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్లకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఇంటిని చూసేందుకు వచ్చి... ఇంట్లోని వార్డ్‌ రోబ్‌‌ కు ఎర్ర రంగు వేయడంతో పాటు ప్లాస్టింగు చేసి ఉండటాన్ని గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చిన నవీన్ కెంగేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి వార్డ్‌ రోబ్‌‌ ను తెరచి చూడగా కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభించింది. దీంతో కేసు నమోదు చేసిన కెంగేరి పోలీసులు, ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఇల్లు ఖాళీ చేసిన సమయంలో అతని అమ్మమ్మ కనిపించలేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు. దీంతో ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు.

More Telugu News