: మళ్లీ జైలుకు లాలుప్రసాద్ యాదవ్!.. కుట్రపై నేడు సుప్రీం తీర్పు

ఒకనాటి కరిష్మాను కోల్పోయి నానా ఇబ్బందుల్లో ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాణా స్కాం కేసులో ప్రస్తుతం లాలు బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన హైకోర్టు ఇందులో కుట్ర జరిగిందనే వాదనను తోసిపుచ్చి ఆ అభియోగాలను కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు ముగిశాయి. నేడు (సోమవారం) తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాణా స్కాంలో కుట్ర కూడా ఉందన్న సీబీఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే కనుక లాలు బెయిలు రద్దయి తిరిగి జైలుకు వెళ్లే అవకాశం ఉంది.

మరోవైపు జైలులో ఉండాల్సిన లాలు ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న మరో వ్యక్తి (మాఫియా డాన్ షహబుద్దీన్)తో మాట్లాడి ఆయన ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తానని చెప్పడం బెయిలు షరతులను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి ఆయన బెయిలు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

 కాగా, 1990-97 మధ్య కాలంలో పశువుల దాణా పేరిట ఏకంగా రూ.9,400 కోట్లను లాలు జీర్ణం చేసుకున్నారని రుజువైంది. ఈ కేసులో ఆయనకు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ఉన్న మిగిలిన వారు బెయిలుపై బయట ఉన్నారని, తనకు కూడా ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2013లో లాలుకు బెయిల్ ఇచ్చింది.

More Telugu News