: ఐసిస్ ఉగ్రవాదుల వాట్సాప్ గ్రూప్‌లో కేరళీయులు!

కేరళలోని కసర్‌గడ్ నుంచి అదృశ్యమై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరిన 14 మంది యువకులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేస్తున్న విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న ఓ వాట్సాప్ గ్రూపులో కసర్‌గడ్‌కు చెందిన కొందరి వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. కసర్‌గడ్‌లోని మిత్రులతో ‘టచ్’లో ఉండేందుకే ఉగ్రవాదులు ఈ వాట్సాప్ గ్రూపును రూపొందించి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రూపులో ఉన్న కొందరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఈ విషయమై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఆఫ్ఘాన్ నుంచి ఆపరేట్ అవుతున్న వాట్సాప్ గ్రూప్‌ను కసర్‌గడ్‌కు చెందిన అబ్దుల్ రషీద్ ఆఫ్ఘనిస్థాన్‌లో తీసుకున్న మొబైల్ నంబరుతో ప్రారంభించినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ గ్రూపులో గ్రామంలో తనకు పరిచయమున్న వ్యక్తులను రషీద్ చేర్చాడు. కేరళ నుంచి 21 మంది యువకులను ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించినట్టు రషీద్‌పై ఆరోపణలున్నాయి. వాట్సాప్ ద్వారా గ్రామంలోని మరింతమందికి వల వేసి ఐసిస్‌వైపు ఆకర్షించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

More Telugu News