: నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో: కోహ్లీతో సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, జట్టులో కీలక ఆటగాడిగా, తన అసాధారణ ఆటతీరుతో క్రికెట్ అభిమానులకు చేరువైన విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఘోరంగా విఫలం కావడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. గత సంవత్సరం సీజన్ లో 4 సెంచరీలు సహా 973 పరుగులు సాధించిన కోహ్లీ, ఈ దఫా 8 మ్యాచ్ లు ఆడి 245 పరుగులు మాత్రమే చేశాడు. ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలై, ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ఇప్పుడిక విరాట్ చేయాల్సిన పని ఒక్కటే మిగిలిందని, అద్దం ముందు కూర్చుని తనను తాను చూసుకోవాలని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ, అవుట్ అవుతున్న తీరు తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని, చెత్త షాట్ లు ఆడుతూ అవుట్ అవుతున్నాడని విమర్శించారు. పంజాబ్ తో, కోల్ కతాతో ఆడిన మ్యాచ్ లలో షాట్ ఎంపికలో తప్పిదాలు చేశాడని, ఇక కోహ్లీ, తనను తాను పునరావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సలహా ఇచ్చారు.

More Telugu News