: తిరుపతిలో రూ.140 కోట్లతో ‘టాటా’ కేన్సర్ ఆసుపత్రి!

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టాటా సంస్థ కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ రోజు తిరుమలలో టీటీడీ ఈవో సాంబశివరావు, టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్ పరస్పర అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం, చంద్రశేఖరన్, వెంకట రమణన్, సాంబశివరావు మాట్లాడుతూ, రూ.140 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి టాటా ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు అందుతుండగా, మిగిలిన రూ. 40 కోట్లను సమకూర్చేందుకు మరికొందరు దాతలు ముందుకొచ్చారన్నారు. రెండేళ్లలోనే వైద్యశాల నిర్మాణ పనులు పూర్తి చేసి కేన్సర్ రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తిరుపతి అలిపిరికి సమీపంలో 25 ఎకరాల టీటీడీ స్థలాన్ని లీజు కింద టాటా ట్రస్టుకు కేటాయించామన్నారు. కాగా, ముంబయి, కోల్ కతాలో ఇప్పటికే ‘టాటా’ కేన్సర్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.

More Telugu News