: ఉత్తర కొరియా దౌత్యాధికారిని, ఆయన భార్యనూ కొట్టిన పాకిస్థాన్... తీవ్రంగా స్పందించిన కిమ్ జాన్ ప్రభుత్వం

పాకిస్థాన్ లో విధులు నిర్వహిస్తున్న తమ దౌత్యాధికారిని, ఆయన భార్యనూ పాక్ అధికారులు దారుణంగా కొట్టారని ఉత్తర కొరియా ఆరోపించింది. కరాచీలోని ఆయన ఇంట్లోకి చొచ్చుకువచ్చిన పది మంది సాయుధులు దౌత్యాధికారిని హింసించడంతో పాటు, ఆయన భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చారని, ఇద్దరి తలలపై తుపాకులు గురిపెట్టారని, ఆపై ఆ జంట ఫోటోలను తీశారని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతూ లిఖిత పూర్వక నిరసనను నార్త్ కొరియా ఎంబసీ పాక్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ విభాగం చీఫ్ కు పంపింది.

ఏప్రిల్ 9న ఈ ఘటన జరిగిందని, దీనిపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని తమ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. జరిగిన ఘటన సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయిందని, ఇంత ఘోరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా, ఈ లేఖపై స్పందించిన పాక్ ఉన్నతాధికారి షోయబ్ సిద్ధిఖీ, కెమెరాలను పరిశీలిస్తున్నామని, దాడికి పాల్పడింది ఎవరన్న విషయాన్ని విచారిస్తున్నామని తెలిపింది. కాగా, ఈ దౌత్యాధికారి కరాచీలో ఏ విధుల్లో ఉన్నారన్న విషయం తెలియరాలేదు.

More Telugu News