: అటు చంద్రబాబు వెళ్లగానే, ఇటు సచివాలయం ఖాళీ... ముఖం కూడా చూపించని అమాత్యులు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారో లేదో, అమరావతి సచివాలయం బోసిపోయింది. మంత్రి లోకేష్ మినహా మరెవరూ ఇటువైపు కూడా తొంగిచూడలేదు. అమాత్యులే రాకుంటే మనమెందుకనుకున్నారో ఏమో? ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అత్యధికులు సెక్రటేరియట్ కు రాకపోవడంతో ఆఫీసు గదులన్నీ బోసిపోయినట్టు కనిపించాయి.

చంద్రబాబునాయుడు బుధవారం బయలుదేరగానే మధ్యాహ్నం నుంచి అధికారులు ఒక్కొక్కరూ సచివాలయాన్ని వీడగా, గురువారం పూర్తి కళతప్పింది. కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఉన్న మంత్రులు కూడా సచివాలయం వైపు తొంగి చూడలేదు. వాస్తవానికి శని, ఆదివారాలను సచివాలయంలో సెలవుగా పరిగణిస్తుండగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారులు తమ స్వస్థలాలకు పయనమవుతుంటారు. దీన్ని గమనించే ప్రజా విజ్ఞప్తుల రోజును గురువారానికి మార్చినప్పటికీ, నిన్న మంత్రులు, అధికారులూ లేక, తమ గోడును ఎవరికి చెప్పాలో తెలియక పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

More Telugu News