: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడకపోతే ట్రోపీకే అర్థం లేదంటున్న మీడియా ఏజెన్సీలు!

ఇంగ్లండ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ- 2017కి సరైన ఆదరణ లభిస్తుందా? అని మీడియా ఏజెన్సీలు ఆందోళన చెందుతున్నాయి. క్రికెట్ ప్రారంభమైనది ఇంగ్లండ్ లో అయినప్పటికీ దానికి విశేషమైన ఆదరణ లభించేది మాత్రం భారత్ లోనే...భారత్ తో చిన్న దేశం టోర్నీ ఆడినా...దానికి లభించే ఆదరణ విశేషంగా ఉంటుంది. ఐసీసీ నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న జట్లను ఇప్పటికే ప్రకటించాయి. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని పట్టించుకోవడం లేదు. ఇంతవరకు జట్టును ప్రకటించలేదు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఇంగ్లండ్‌, వేల్స్‌ వేదికగా జూన్‌ 1 నుంచి టోర్నీ ఆరంభం కానుంది. టోర్నీ ఆరంభానికి ఇంకా నెల రోజుల వ్యవధి కూడా లేదు.టీమిండియా నుంచి ఎలాంటి స్పందన లేదు.

దీంతో  టోర్నీకి ప్రచారం ఇస్తున్న మీడియా ఏజెన్సీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఈ టోర్నీలో పాల్గొనకపోతే టోర్నీకే అర్థం ఉండదని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బీసీసీఐ, ఐసీసీ తక్షణ చర్యలు చేపడతాయని భావిస్తున్నట్లు స్టార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఐసీసీలో నూతన ఆదాయ పంపిణీ నమూనాకు అనుకూలంగా సభ్యదేశాలు ఓట్లు వేశాయి. దీంతో బీసీసీఐ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో బీసీసీఐ... ఈ టోర్నీపై ఆసక్తి చూపడం లేదు. మరో వంద మిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పినప్పటికీ భారత్ పట్టించుకోవడం లేదు. నూతన ఆదాయ నమూనా అమలైనా 450 మిలియన్‌ డాలర్లు అదనంగా ఇవ్వాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. దీనికి అంగీకరిస్తేనే ఐసీసీతో సానుకూల చర్చ జరిగే అవకాశం ఉంది. 

More Telugu News