: వందేళ్లే... ఆ తరువాత భూమిని వదిలి మరేదైనా గ్రహం చూసుకోవాల్సిందే: స్టీఫెన్ హాకింగ్స్

మరో వందేళ్లలో భూమిని మానవులు వీడిపోవాల్సిందేనని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరించారు. భూమికి పెను ముప్పు పొంచి ఉందని ఆయన తెలిపారు. తాజాగా చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులకు తోడు, భూమికి గ్రహశకలాల తాకిడి పెరిగిపోతుందని, భూమి వైశాల్యానికి మించిన జనసాంద్రత ముప్పుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మానవజాతి మనుగడ సాగించాలంటే... వచ్చే వందేళ్లలో నివాసయోగ్యమైన మరో గ్రహాన్ని చూసుకుని...అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు.

 అణుయుద్ధాలు, జన్యుమార్పిడి వైరస్ లు, భూతాపం భూమికి పెను సవాళ్లు విసురుతాయని, వాటి నుంచి భూమికి పెను ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. 14 ఏళ్ల క్రితం బీబీసీ ప్రసారం చేసి, ఆపేసిన ‘టుమారోస్‌ వరల్డ్‌’ సిరీస్ ను మళ్లీ ప్రసారం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... అందులో ప్రసారం చేసేందుకు ‘కొత్త భూమి కోసం అన్వేషణ’ పేరిట ఆయన ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో మానవ మనుగడకు అవసరమైన సూచనలు చేశారు. ఈ విషయాలు కూడా అందులో వివరించినవే కావడం విశేషం. 

More Telugu News