: ప్రభాస్.. ఈ ఏడాదైనా ఈ బావ కోరిక తీర్చు!: నటుడు మోహన్ బాబు

‘బాహుబలి-2’పై పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సీనియర్ నటుడు మోహన్ బాబు తన దైన శైలిలో ప్రశంసించారు. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కథా రచయిత విజయేంద్రప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి శ్రీవల్లి, నటులు రానా, ప్రభాస్ పై ఆయన ప్రశంసలు కురిపించారు.

‘డియర్ శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని.. నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. ప్రియమైన రానా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు..దిగ్విజయోస్తు.. మరకతమణిగా..ఎంఎం క్రీమ్ గా..కీరవాణిగా..ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’

‘బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. ప్రభాస్ కు విజయీభవ.

 ప్రియమైన రాజమౌళి..భారతదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని అన్నయ్య ఎన్ టి రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను..ప్రియమైన ప్రసాద్..బాహుబలి విజయంతో విశ్వ విజయేంద్రప్రసాద్ గా సార్థక నామధేయుడివి అయ్యావు. ఒక తెలుగు రచయితగా విశ్వ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’ అని తన వరుస ట్వీట్లలో మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. 

More Telugu News