: ముంబైలో సెల్ఫీ విషాదం.. ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి!

ఇంజనీరింగ్ విద్యార్థిని ఒకరు తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన తమిళనాడుకు చెందిన మీనాక్షి ప్రియ రాజేశ్ గత నెల 30న తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి ముంబై సందర్శించేందుకు వెళ్లింది. అంథేరిలోని ఓ హోటల్ లో వారి కుటుంబం బస చేసింది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బాంద్రా పోర్ట్ వద్దకు మీనాక్షి కుటుంబం వెళ్లింది.

అక్కడ ఉన్న ఓ పెద్ద కొండపై నుంచి తన తల్లి, అక్కతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా మీనాక్షి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఈ సంఘటన జరిగిన రెండు గంటల అనంతరం సముద్రంలో కొట్టుకుపోతున్న మీనాక్షి మృతదేహాన్ని అక్కడి మత్స్యకారులు, సంబంధిత అధికారులు గుర్తించారు. కాగా, మీనాక్షి కుటుంబం సెల్ఫీలు దిగిన ప్రాంతం ప్రమాదకరమని, అక్కడ సెల్ఫీలు దిగవద్దని హెచ్చరిస్తూ ముంబై పోలీసులు గతంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. 

More Telugu News