: 'రాజు'ల కులంపై ప్రభాస్ దృష్టి పెట్టుంటే..!: రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్!

'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాపై రాంగోపాల్ వర్మ ట్వీట్ల ప్రభంజనం ఆగడం లేదు. ఇంతవరకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఘనత, ప్ర‌భాస్ నటన, రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై వరుస ట్వీట్లతో తన సొంత సినిమా కంటే ఎక్కువ ప్రచారం చేసిన రాంగోపాల్ వర్మ... తాజాగా ప్రభాస్ పై వివాదాస్పద ట్వీట్ చేశాడు. ప్రభాస్ కులానికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ టాలీవుడ్ లో పెను దుమారాన్నే రేపుతోంది. టాలీవుడ్ లో ఇత‌ర హీరోలు కాపులు, క‌మ్మ‌లపై శ్ర‌ద్ధ చూపిన‌ట్టుగా ప్ర‌భాస్ త‌న కుల‌మైన‌ రాజులపైనే దృష్టి పెట్టుంటే ఇంత క్రేజ్ వ‌చ్చేది కాద‌ని రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశాడు.

ప్ర‌భాస్ అలా ఆలోచించ‌లేదు కాబట్టే ఇంట‌ర్నేష‌నల్ స్టార్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. ఇకపై ప్ర‌భాస్ లోక‌ల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రభాస్ కు నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇతర హీరోలను ఎద్దేవా చేస్తూ... లోక‌ల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించే స్టార్స్ ఎప్పుడూ లోక‌ల్ స్టార్స్ గానే మిగిలిపోతార‌ని అన్నాడు. ఈ ట్వీట్స్ టాలీవుడ్ లో పెద్దదుమారం రేపకపోయినా...టాలీవుడ్ అభిమానుల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి. వర్మ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్స్ చేశాడోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.





More Telugu News