: ముఖ్యమంత్రి చెబితే ఎర్ర బుగ్గ తీస్తా: కర్ణాటక మంత్రి

వీవీఐపీ సంస్కృతికి గుడ్ బై చెబుతూ వారి కార్లపై ఉన్న ఎర్ర బుగ్గలను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా, వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మోదీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయడం తెలిసిందే. ముఖ్యంగా, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పటికీ, మోదీ నిర్ణయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేయడమే కాదు, తన అధికారిక కారుపై ఎర్రబుగ్గ తీసి వేసేందుకు చాలా ఉత్సాహం కనబరచడం విదితమే.

అయితే, స్వయంగా సీఎం చెబితే కానీ, తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను తొలగించనని కర్ణాటక ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ మంత్రి యూటీ ఖాదర్ అంటున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనకు ఆదేశాలు జారీ చేస్తే, ఎర్రబుగ్గ తీసేస్తానని చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం తనకు అధికారిక వాహనం ఇచ్చిన సమయంలో దానిపై ఎర్రబుగ్గ ఉందని, ఇప్పుడు.. ఎటువంటి మార్పులు చేసే అధికారం తనకు లేదని అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పడం గమనార్హం.

More Telugu News