: ఆ పదవి కోసం ఆఖరి పోరాటం చేస్తున్న రాయపాటి సాంబశివరావు!

తిరుమల వెంకన్నకు వీర భక్తుడైన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆఖరి పోరాటం చేస్తున్నారు. తన చిరకాల వాంఛ అయిన టీటీడీ ఛైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ పదవి కోసం ఆయన రెండుసార్లు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆదికేశవులు నాయుడు ఒకసారి, కనుమూరి బాపిరాజు మరోసారి ఆ పదవిని సొంతం చేసుకున్నారు.

ఇక సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలుపొందిన రాయపాటి... ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలగుతున్నారు. పోయినసారి కూడా ఆయన ఈ పదవి కోసం ప్రయత్నించగా... చివరకు చదలవాడ కృష్ణమూర్తి ఆ పదవిని తన్నుకుపోయారు. అయితే, ఈ పర్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రెండు పదవులు ఉండకూడని పార్టీ భావించే పక్షంలో ఎంపీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని చంద్రబాబుకు లేఖ రాశారు. ఆరు సార్లు ఎంపీగా పనిచేశానని... ప్రస్తుతం తనకు ఎంపీ పదవికన్నా టీటీడీ ఛైర్మన్ పదవే ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందేమో వేచి చూడాలి.

More Telugu News