: ఎప్పుడొచ్చినా భారతావని కొత్తగా కనిపిస్తుంది!: మోదీపై బిల్ గేట్స్ పొగడ్తలు

బిల్ గేట్స్... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇటీవల ఆయన భారత పర్యటనకు వచ్చిన వేళ, ఎన్నో వీడియోలను, ఫోటోలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. తాజాగా, ఇండియా గేట్ సమీపంలో ఆటో రిక్షాలో కూర్చుని వెళుతూ తీయించుకున్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, "ప్రతియేటా కనీసం ఒక్కసారన్నా ఇండియాకు వెళ్లాలని అనుకుంటా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ కొత్తదనం కనిపిస్తుంది" అన్న కామెంట్ ను పెట్టారు. ఈ ఉదయం 10:22 గంటల సమయానికి ఈ పోస్టు పెట్టి 23 గంటలు కాగా, 14 వేలకు పైగా లైకులను, 4 వేలకు పైగా రీట్వీట్స్ ను తెచ్చుకుని వైరల్ అయింది.

ఇక ఇదే సమయంలో తన బ్లాగులో ఓ పోస్టును పెడుతూ నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ప్రచారాన్ని ఆయన కొనియాడారు. 2019 నాటికి బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలన్న ఆయన ప్రయత్నం సర్వదా అభినందనీయమని, ఆ లక్ష్యాన్ని భారతావని అందుకుంటుందనే భావిస్తున్నానని తెలిపారు. ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ, బహిరంగ మల విసర్జన వంటి సున్నితాంశాన్ని పది మంది ముందూ నిజాయతీగా ఒప్పుకున్న మరో దేశాధినేతను తాను చూడలేదని అన్నారు. ఇండియాలో అపరిశుభ్రత ఎక్కడ కనిపించినా, చర్యలు తీసుకుంటున్నారని, ఇది తనకెంతో నచ్చిందని అన్నారు. ఇక బిల్ గేట్ పోస్టుపై వేలాది కామెంట్లు వచ్చి పడుతున్నాయి.


More Telugu News