: సిద్ధూ ఏంటిది?.. మంత్రిగా మీరు చేస్తున్నది ఏమిటి?: మండిపడిన హైకోర్టు

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తారా? అంటూ నిలదీసింది. సాక్షాత్తూ ఓ మంత్రి ‘‘ఈ యంత్రాన్ని కొంటే ఇంగ్లిష్ ఇట్టే వచ్చేస్తుంది’’ అని చెప్పే ప్రకటనల్లో నటించడం సబబు కాదని మొట్టికాయలు వేసింది. దీనిపై తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

సిద్ధూ వాణిజ్య ప్రకటనల్లో నటించడంపై పంజాబ్‌కే చెందిన ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. ఇక కపిల్ శర్మ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సిద్ధూ అసభ్యకరమైన జోకులు వేస్తున్నారంటూ ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. ఈ షో నుంచి తప్పుకోవాలని సిద్ధూను ఆదేశించాల్సిందిగా అరోరా అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. సిద్ధూ వేసే అర్థంపర్థం లేని జోకుల వల్ల పంజాబ్ ప్రతిష్ఠ దిగజారుతోందంటూ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌కు ఆయన లేఖ రాశారు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలపై సిద్ధూ మాట్లాడుతూ అనధికారికంగా తానేం చేసినా ప్రశ్నించే అర్హత బయటి వ్యక్తులకు లేదన్నారు. మంత్రిగా, టీవీ వ్యాఖ్యాతగా రెండు పనులకు తాను న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు.

More Telugu News