: ధోనీ లేకుండానే జరిగిన ధోనీ నూతన గృహప్రవేశం!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండానే ఆయన గృహ ప్రవేశం జరగడం ఆసక్తి రేపుతోంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ధోనీ కుటుంబసభ్యులు నూతన గృహంలో ప్రవేశించారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న ధోనీ తన టైట్ షెడ్యూల్ కారణంగా గృహప్రవేశ కార్యక్రమానికి హాజరుకాలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, 2016 జులై 7న తన జన్మదినం సందర్భంగా ఓ మొక్క నాటిన ధోనీ... దానిని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుని...అది తన ఇంటి ఆవరణ అని, నూతనంగా అన్ని సౌకర్యాలతో ఇంటిని నిర్మించుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

జార్ఖాండ్ రాజధాని రాంచీలోని రింగు రోడ్డుకు సమీపంలోని సుమారు ఏడు ఎకరాల్లో ‘కైలాస్‌ పతి’ పేరిట నిర్మించిన ఈ ఫామ్‌ హౌస్‌ లో అత్యాధునిక సౌకర్యాలు వున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు వీలుగా నెట్‌ ప్రాక్టీస్‌ ఫీల్డ్‌, అత్యాధునిక జిమ్‌ వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గృహ ప్రవేశంలో ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్‌ ధోనీ, దేవకి ధోనీ, భార్య సాక్షి, కుమార్తె జీవా, ఇతర సన్నిహితులు పాల్గొన్నారు.

More Telugu News