: నా గడ్డం ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయింది: టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

టీఆర్‌ఎస్‌ నాయకులకు తన గడ్డం ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయిందని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ అంతర్గత సమావేశాలు, బహిరంగసభలు కూడా తన గడ్డం గురించి మాట్లాడకుండా పూర్తికావడంలేదని చ‌మ‌త్క‌రించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేవ‌ర‌కు తాను గ‌డ్డం తీయ‌బోన‌ని ఆయ‌న శ‌ప‌థం చేసి విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు టీఆర్‌ఎస్‌లోని చాలామంది నాయకులు త‌మ‌తో మాట్లాడుతూనే ఉన్నారని, వ‌చ్చే ఎన్నికలకు ముందుగానే వారంతా త‌మ పార్టీలోకి వ‌చ్చేస్తార‌ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ రోజు గాంధీభవన్‌లో ‌ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని అన్నారు. మ‌రోవైపు త‌మ పార్టీలోకి వలసలు భారీగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ‌లో అప్పుడే ఎన్నికల మూడ్‌ వచ్చిందని, అధికార పార్టీ ఈ ప‌రిస్థితిని తెచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అభద్రత భావం నెల‌కొంద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న ఇప్ప‌టి సంగ‌తి వ‌దిలేసి, రాబోయే ఏడాది ఎరువులకు ఇస్తామని, వచ్చే ఏడాది కరెంటు ఇస్తామని ఊరించడం ఏమిటని ఆయ‌న విమ‌ర్శించారు.

More Telugu News