: 50 నగరాలకు బంపరాఫర్ ప్రకటించిన మోదీ... అందులో భాగస్వాములయ్యే చాన్స్ టర్కీకి!

ఇండియాలోని 50 నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను నిర్మించనున్నామని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని టర్కీ సంస్థలకు ఆహ్వానం పలికారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన టర్కీ అధ్యక్షుడు రిసెప్ ఎర్డగోన్ తో కలసి ఇండియా - టర్కీ వాణిజ్య సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల కొత్త ఇండ్లను కట్టబోతున్నామని, ఈ ప్రాజెక్టుల్లో చేతులు కలిపేందుకు టర్కీ రియల్ ఎస్టేట్ సంస్థలకు తొలి అవకాశం ఇస్తామని అన్నారు. అతి త్వరలో మెట్రో ప్రాజెక్టులు వచ్చే నగరాల పేర్లను వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్యా వ్యాపార భాగస్వామ్యం మరింతగా పెరగాల్సి వుందని, అది జరిగితే ద్వైపాక్షిక బంధం కూడా బలోపేతం అవుతుందని అన్నారు. ఆర్థికాభివృద్ధిలో రెండు దేశాలూ ఒకే దారిలో నడుస్తున్నాయని, టాప్-20 ఆర్థిక వ్యవస్థల్లో టర్కీ, ఇండియా ఉండటం కలిసొచ్చే అంశమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం చుట్టుముట్టిన వేళ, టర్కీ, ఇండియాలు స్థిరంగా నిలిచాయని గుర్తు చేశారు.

More Telugu News