: నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు: జయలలిత మేనకోడలు దీప

తనను హతమారుస్తామని కొంత మంది బెదిరిస్తున్నారని దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీపై పెరవై పార్టీ అధ్యక్షురాలు దీప ఆరోపించారు. చెన్నైలో ఆమె విడుదల చేసిన ప్రకటనలో... తన మేనత్త దివంగత జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. తొలుత తనను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పలువురు పావులు కదిపారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని, వారి కుయుక్తులన్నీ అడ్డుకుని, తాను రాజకీయ రంగప్రవేశం చేశానని చెప్పారు.

వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు తనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ అనుచరులు తనకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. రాందాస్ చెబుతున్న 'అవినీతి నిర్మూలన' ప్రకటనలన్నీ భోగస్ అని ఆమె చెప్పారు. మతాల పేరుతో పీఎంకే నేతలు రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను బెదిరించినా, తన మేనత్త జయలలితను ఆదర్శంగా తీసుకుని రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటానని ఆమె తెలిపారు. 

More Telugu News