: మేం ప్లే ఆఫ్ రేసులో లేనట్టే: విరాట్ కోహ్లీ

ఈ సీజనులో తాము ఘోరమైన ప్రదర్శన కనబరిచామని, ఇక ప్లే ఆఫ్ రేసులో తమ జట్టు లేనట్టేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాము ఎలా ఆడి ఓడిపోయామో అందరికీ తెలిసిందని, మాట్లాడాలంటేనే తనకు కష్టంగా ఉందని చెప్పాడు. ప్రత్యర్థి జట్లు గెలిచాయని చెప్పడం కన్నా, తాము ఓడిపోయామని అనడమే సబబని అన్నాడు. జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, అందుకు కారణాలు ఏమిటన్న విషయమై కచ్చితంగా చెప్పలేనని అన్నాడు.

ప్లే ఆఫ్ రేసు నుంచి తమ జట్టు తప్పుకున్నట్టేనని, తాము ఆడాల్సిన మిగిలిన నాలుగు మ్యాచ్ లనూ ఒత్తిడి లేకుండా ఆడతామని అన్నాడు. కాగా, నిన్నటి ఓటమితో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. అద్భుతాలు జరిగి, కోల్ కతా, ముంబై జట్లు తామాడాల్సిన అన్ని మ్యాచ్ లలో గెలవడం, హైదరాబాద్, పుణెలు అన్ని మ్యాచ్ లలో ఓడి, బెంగళూరు నాలుగు మ్యాచ్ లలో గెలిచిన పరిస్థితి ఏర్పడితే, ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు నెట్ రన్ రేటుపై ఆధారపడి ఉంటాయి. సాంకేతికంగా అవకాశం కనిపిస్తున్నా, అది జరగడమంటూ జరిగితే అద్భుతమే!

More Telugu News