: వాహనం నడుపుతూనే ఫోన్ కాల్స్ మాట్లాడతాం: సర్వేలో ఆసక్తికర విషయాలు
రోడ్డుపై వాహనాలు నడిపే వేళ పలు నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. అయితే, వాటిని పాటించేవారు ఎంతమంది? ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పటికీ నిబంధనలను పక్కకు పెట్టేస్తున్నారు ఎంతో మంది వాహనదారులు. ముఖ్యంగా డ్రైవింగ్లో సెల్ ఫోన్ను వినియోగిస్తూ కనపడుతున్నారు. ఈ కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు, తీవ్రంగా గాయపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వాహన చోదకులు తమ తీరుమార్చుకోవడం లేదు. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదమని తెలిసినా సగం మంది ఆ అలవాటును మార్చుకోవడం లేదు.
‘కంతార్ పబ్లిక్’తో కలిసి ‘సేవ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, ముంబయి, జైపూర్, బెంగళూరులోని ద్విచక్ర, త్రిచక్ర, లారీ, బస్సు డ్రైవర్ల అభిప్రాయాలను వారు సేకరించి నివేదిక రూపొందించారు. మొత్తం 1749 మంది వాహన చోదకులను వారు ప్రశ్నించారు. వారిలో 47శాతం మంది తాము ప్రయాణం చేస్తూనే వచ్చే ఫోన్ కాల్స్ను మాట్లాడుతున్నామని చెప్పారు. 34 శాతం మంది ఫోన్లో మాట్లాడుతూ ఒక్కోసారి సడన్ బ్రేక్స్ కూడా వేస్తుంటామని పేర్కొన్నారు. మరో 20 శాతం మంది వాహన చోదకులు సెల్ఫోన్ వాడడం వల్ల తాము ప్రమాదాలకు కూడా గురయ్యామని, మరికొంతమంది త్రుటిలో తప్పించుకున్నామని చెప్పారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ వాడకూడదన్న విషయాన్ని 96 శాతం మంది ఒప్పుకున్నారు.