: విచిత్ర అనుభవం.. ‘బాహుబలి-2’ సినిమా సెకండ్‌ ఆఫ్‌ను ముందు ప్లే చేసిన థియేటర్ సిబ్బంది!

ఈ రోజు విడుద‌లైన బాహుబలి-2 సినిమా సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సినీ అభిమానుల దార్ల‌న్నీ బాహుబ‌లి ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ సినిమా థియేట‌ర్ల వైపే ఉన్నాయి. అయితే, బెంగళూరులోని కొందరు అభిమానులకు విచిత్ర అనుభ‌వం ఎదురైంది. బెంగళూరులోని పీవీఆర్‌ ఎరీనా మాల్‌లో నిన్న రాత్రి బాహుబలి ప్రీమియర్‌ షో ఏర్పాటు చేయ‌గా ఆ థియేటర్లో సెకండ్‌ ఆఫ్‌ను ముందు ప్లే చేశారు.

సినిమా మొదలవగానే బాహుబ‌లి ప్ర‌భాస్, భ‌ల్లాల దేవుడి సేన‌లు యుద్ధంలో పాల్గొంటూ క‌నిపించాయి. సినిమా మొద‌లు కాగానే ఇటువంటి సీన్ వ‌స్తుందేంటీ అనుకున్న అభిమానులు అది అంతేనేమో అనుకుని అలాగే చూసేశారు. అయితే, కాసేపటికి క్లైమాక్స్‌ సీన్ వ‌చ్చేయ‌డంతో ప్రేక్షకులకు అసలు విషయం అర్థమైపోయి, సెకండ్‌ ఆఫ్‌ను ముందు వేశారేంట‌ని థియేటర్‌ యాజమాన్యాన్ని నిల‌దీశారు. సినిమాను మొదట్నుంచీ మ‌ళ్లీ వేస్తామని థియేటర్‌ యాజమాన్యం చెప్పింది. దీంతో మ‌ళ్లీ ఫ‌స్ట్ ఆఫ్ సినిమాతో పాటు సెకండ్ ఆఫ్‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. మొత్తానికి ఆ ప్రేక్ష‌కులు సెకండ్ ఆఫ్‌ను రెండు సార్లు చూసేశారు.

More Telugu News