: 'బాహుబలి-2' విడుదలకు ముందే... తెలుగులోనే 175 కోట్ల బిజినెస్?

'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా విడుదలకు ముందే భారీ వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రా ఏరియా హక్కుల్ని 50 కోట్ల రూపాయల నుంచి 55 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. కేవలం వైజాగ్‌ ఏరియా ఒక్కటే 12 కోట్ల రూపాయలకు అమ్ముడవ్వడం విశేషం. సీడెడ్‌ ఏరియా 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ రెండు ఏరియాలను వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత, డిస్ట్రి‌బ్యూటర్‌ సాయి కొర్రపాటి కొన్నారు. అంతే కాకుండా కృష్ణా జిల్లా రైట్స్‌ ను కూడా, బాహుబలి నిర్మాతలతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా (లాభాల్లో పంపకాలు) 9 కోట్ల రూపాయలకు ఆయనే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నైజామ్ రైట్స్ 40 కోట్ల రూపాయలకు పైగా రికవరబుల్‌ అడ్వాన్స్‌ తీసుకుని, తక్కువ కమిషన్ (దాదాపు 4 శాతం) మీద డిస్ట్రి‌బ్యూషన్ పద్ధతిలో నిర్మాతలు సొంతంగా రిలీజ్‌ చేసుకుంటుండడం విశేషం.

ఇక సినిమా హక్కులను రెండు పార్ట్ లూ కలిపి 28 కోట్ల రూపాయలకు ‘మా’ టీవీ (ఇప్పటి ‘స్టార్‌ మా’ టీవీ) కి అమ్మేశారు. ఈ లెక్కన రెండో భాగానికి 14 కోట్ల రూపాయలు దక్కింది. దీంతో అవుట్‌ రైట్‌ అమ్మకాలు, తీసుకున్న అడ్వాన్సులు, శాటిలైట్‌ రైట్ల లెక్కల ప్రకారం 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' తెలుగు వెర్షన్ ఒక్కదానికే 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మలయాళం హక్కులను 6 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్యలో అమ్మగా, తమిళ, హిందీ వెర్షన్‌ లను కూడా భారీ ఎత్తున అమ్మినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News