: ముందు ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలిచి.. తర్వాత సీఎం కావాలనుకున్నారు.. దినకరన్ పక్కా ప్లాన్!

రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ విచారణలో చెబుతున్న విషయాలు విని పోలీసులు షాక్ తింటున్నారు. బుధవారం ఢిల్లీ పోలీసుల కస్టడీలోకి వెళ్లిన దినకరన్ ఆరోజు అధికారులు అడిగిన ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పారు. తాజాగా నిజాన్ని అంగీకరించిన ఆయన తన ప్లాన్‌‌ను వివరించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలిచి ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నానని చెప్పినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రెండాకుల గుర్తు కోసం ఈసీకి ఇవ్వాలనుకున్న సొమ్ములో పది కోట్ల రూపాయలను స్నేహితుడు మల్లికార్జున్ ఏర్పాటు చేయగా మిగిలిన రూ.50 కోట్లను కొందరు వ్యాపారుల నుంచి ఇప్పిస్తానని మల్లికార్జున్ చెప్పినట్టు దినకరన్ వివరించారు. హవాలా మార్గంలో ఈ సొమ్మును అప్పగించేందుకు ఏర్పాటు కూడా జరిగినట్టు వివరించారు. ఇందుకు చాందినీ చౌక్‌కు చెందిన హవాలా డీలర్లు, కొచ్చికి చెందిన షేక్ ఫైజల్ అనే వ్యక్తి సహకరించినట్టు దినకరన్ తెలిపారు. కాగా, గురువారం ఢిల్లీ నుంచి దినకరన్, మల్లికార్జున్‌లను చెన్నై తీసుకొచ్చిన ఢిల్లీ పోలీసులు మొదట దినకరన్ కార్యాలయంలోను, నివాసంలోను విచారించారు. ఆయన భార్య అనురాధను కూడా ప్రశ్నించారు.

More Telugu News