: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... 700 బంగారు గొలుసులు కొట్టేశాడు!

జయేష్ అలియాస్ జనక్ పంచాల్... ఇతన్ని చైన్ స్నాచింగ్ గురు అనడంలో ఏం తప్పు లేదు. అహ్మదాబాద్ కు చెందిన 49 ఏళ్ల ఈ వ్యక్తి గత ముప్పై ఏళ్లుగా మహిళల మెడల్లోని గొలుసులు కొట్టేస్తున్నాడు. చివరకు అహ్మదాబాద్ పోలీసులు ఇతన్ని వలపన్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ చోరశిఖామణి 700 మంది మహిళల మెడల్లోని గొలుసులను దొంగిలించాడని పోలీసులు తేల్చి చెప్పారు.

చైన్ స్నాచింగ్ లో నిష్ణాతుడైన జనక్ పంచాల్ కు ఆ ఫీల్డ్ లో పాప్యులారిటీ  ఎక్కువే. ఇతని దగ్గర ఎంతో మంది యువ దొంగలు చైన్ స్నాచింగ్ చిట్కాలు నేర్చుకున్నారట. అంతేకాదు, స్వయంగా 22 మంది స్నాచర్లకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి, సిటీ మీదకు వదిలాడని పోలీసుల విచారణలో తేలింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గత ఏడాది జనవరిలో బెయిల్ పై విడుదలైన జనక్ పంచాల్ ... 70 రోజుల్లో 70 గొలుసులు కొట్టేశాడట.

1997లో 19 ఏళ్ల వయసులో స్కూటర్ పై తిరుగుతూ చైన్ స్నాచింగ్ చేయడం ప్రారంభించానని పంచాల్ తెలిపాడు. బైక్ ను బాగా డ్రైవ్ చేసే సలీంను డ్రైవర్ గా పెట్టుకుని... ఆయన బైక్ తోలుతుండగా, వెనక కూర్చొని గొలుసులు లాగేస్తున్నానని పోలీసులతో పంచాల్ చెప్పాడు. ఇప్పుడు పంచాల్ శిష్యులైన 22 మందిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 

More Telugu News