: నా బిడ్డలను నీవే కాపాడాలంటూ వేడుకున్న ఓ తల్లి.. నేనున్నానంటూ అభయమిచ్చిన లారెన్స్!

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. చెన్నై మందవెల్లికి చెందిన శ్రీనివాసన్, గాయత్రి దంపతులకు ఒకే కాన్పులో లక్ష్మణ్, లక్ష్య, లక్షిక, లక్ష అనే నలుగురు పిల్లలు పుట్టారు. అయితే, ఈ నలుగురినీ పోషించేందుకు వారి ఆర్థిక స్తోమత సరిపోలేదు. పిల్లల్ని పెంచేందుకు ఎన్నో బాధలు పడుతున్నారు. దీంతో, లారెన్స్ వద్దకు వెళ్లాలని, అడిగితే ఆయన ఏదీ కాదనడని కొందరు వారికి సూచించారు.

ఈ నేపథ్యంలో వారు కన్నీటితో లారెన్స్ ను కలిశారు. 'మా బిడ్డలను నీవే కాపాడాలన్నా' అంటూ ఆ తల్లి కన్నీటితో వేడుకోవడంతో... లారెన్స్ కరిగిపోయాడు. అన్నా అని పిలిచావ్ గా... మేనమామలా చూసుకుంటానని ఆమెకు చెప్పాడు. మూడేళ్ల వయసున్న ఈ పిల్లల చదువు, పోషణ, ఇతర అవసరాలన్నింటినీ తానే చూసుకుంటానని తెలిపాడు. తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి బిడ్డలను చూసుకోవచ్చని వారికి చెప్పాడు.

తన ఛారిటబుల్ ట్రస్ట్ తరపున లారెన్స్ ఇప్పటికే ఎంతోమంది పిల్లలను అక్కున చేర్చుకున్నాడు. వారందరికీ మంచి విద్య, పోషకాహారం అందిస్తున్నాడు. వారి మంచి చెడ్డలను చూసుకుంటూ, వారి బంగారు భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. హ్యాట్సాఫ్ టు లారెన్స్. 

More Telugu News