: తెలంగాణలో 'బాహుబలి' షోను ముందురోజు వేసుకోవాలంటే ఈ విధంగా చేయాలి!: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి లేదని, నిబంధనలను పట్టించుకోకుండా ఎవరైనా ముందస్తుగా షోలు ప్రదర్శించినా, టికెట్ల ధరలు పెంచినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు పడుతున్నాయన్న విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి బెనిఫిట్ షోలుగా వేస్తే ధియేటర్ యాజమాన్యాలే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు వారే బాధ్యులు అవుతారని అన్నారు.

తమ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టుగా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి, ఒకవేళ ముందుగా షోలు వేసుకోవాలంటే కనుక... ఏప్రిల్ 27న రాత్రి షోతో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని వారు ప్రకటించాలని, ఆ ప్రకటనను ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేయాలని మంత్రి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా బెనిఫిట్ షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

More Telugu News