: నటి కుష్బూ ఇక విదేశాలు వెళ్లొచ్చు.. అనుమతినిచ్చిన హైకోర్టు

ప్రముఖ నటి కుష్బూ ఇక ఎంచక్కా విదేశాలు వెళ్లొచ్చు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ఎదుర్కొంటున్న ఆమె విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా మంగళవారం హైకోర్టు మధురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. బుధవారం ఆమె దరఖాస్తును విచారించిన కోర్టు విహారయాత్రకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేసింది. 2011 శాసనసభ ఎన్నికల్లో తేని జిల్లా ఆండిపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండడంతో ఆమె పాస్‌పోర్టును రెన్యువల్ చేసేందుకు అధికారులు నిరాకరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.

More Telugu News