: 'కూలీ నంబర్ వన్'గా.. తలసాని శ్రీనివాస్ యాదవ్!

వరంగల్ సభ నిధుల సమీకరణ కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలంతా గులాబీ కూలీలుగా మారారు. ఎవరికి నచ్చిన పనులను వారు చేస్తూ గంటల్లోనే లక్షల రూపాయల కూలిని సంపాదిస్తున్నారు. ఈ కూలి సంపాదనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాప్ ప్లేస్ లో నిలిచారు. మొత్తం రూ. 16.50 లక్షల కూలి సంపాదించారు.

ఈ సంపాదన కోసం బోయిన్ పల్లి మార్కెట్లో మూటలు మోయడం, బేగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో టైల్స్ మోయడం, సనత్ నగర్ లోని జెక్ కాలనీలో మట్టి మోయడం, హోటల్ లో చాయ్ అమ్మడం, ఓ టిఫిన్ సెంటర్ లో సర్వర్ గా పని చేయడం, రోడ్లను శుభ్రపరచడం, పుస్తకాలను విక్రయించడం, ఇసుక మోయడం, నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వాటర్ జోన్ లో టికెట్లను అమ్మడం, మోండా మార్కెట్ లో కూరగాయలు అమ్మడం, మటన్ షాపులో మటన్ అమ్మడం లాంటి పనులను తలసాని చేశారు. నగరంలోని పలు ప్రాంతాలలో స్థానిక నాయకులతో కలసి ఆయన కూలి పనులలో పాల్గొన్నారు.  

ఇక ఈ కూలి పనులు చేయడం ద్వారా మంత్రి హరీష్ రావు దాదాపు రూ. 9 లక్షలు, కేటీఆర్ దాదాపు రూ. 7.5 లక్షలు సంపాదించారు. అయితే, అందరికంటే ఎక్కువ కూలి సంపాదించి కూలీ నంబర్ వన్ గా తలసాని నిలిచారు. 

More Telugu News