: వ్యూహం మార్చిన పాకిస్థాన్...మత ప్రచారం ముసుగులో ఉగ్రవాదం... భారత్ చేతితోనే భారత్ కన్ను పొడిచే ఎత్తుగడ!

భారత్ పై పాకిస్థాన్ వ్యూహం మార్చింది. భారత్ లోని కశ్మీర్ లో ఉన్న ముస్లింలను వినియోగించుకుని భారత్ లో అశాంతి రేపాలని నిర్ణయించింది. గతంలో కేవలం ఉగ్రదాడులతో మాత్రమే భారత్ లో అశాంతిని రేపేది. ఉగ్రవాదులను భారత్ పట్టుకుని శిక్షిస్తుండడానికి తోడు, వారిని సజీవంగా పట్టుకుని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడుతోంది. ఇది పాక్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పాకిస్థాన్ వ్యూహం మార్చింది. ఇకపై ఉగ్రవాదానికి మతబోధనల ముసుగు తొడగనుంది. ఉగ్రవాద సిద్ధాంతాలు బాగా వంటబట్టించుకుని, సమర్థవంతంగా వాటిని యువకుల్లోకి ఎక్కించగల నిపుణులను భారత్ కు పంపనుంది.

వీరు చేయాల్సిందల్లా మత బోధనల ద్వారా కశ్మీరీ యువతను రెచ్చగొట్టడం.. భారత్ భద్రతా బలగాలపై రాళ్లదాడులు ప్రోత్సహించడం! ఈ మేరకు పాకిస్థాన్ ఏకవాక్య ఆదేశాలు జారీ చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పాకిస్థాన్ లో శిక్షణ పొందిన 150 మంది ఉగ్రవాదులు కశ్మీర్ బయట ఉన్నారని, వారిలో 40 మంది ఇప్పటి వరకు ఒక్క తూటా కూడా వినియోగించలేదని, దీంతో అనుమానం వచ్చి వారిపై నిఘా పెంచగా, వారంతా ఉగ్రవాదాన్ని యువకుల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు మత సిద్ధాంత కర్తల ముసుగు తొడిగారని గుర్తించింది. అలాగే కశ్మీర్ లో ఉన్న లష్కరే తొయిబా కమాండర్ అబు దుజానా కూడా మత బోధకుడిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికి మూడు సార్లు అబు దుజానా రాళ్లు విసిరే కార్యకర్తలను కవచంగా చేసుకుని భద్రతా బలగాల కంటబడకుండా తప్పించుకున్నాడని నిఘా సంస్థలు చెబుతున్నాయి.

బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నాటికి పాకిస్థాన్ లో శిక్షణపొంది ఉగ్రవాద బోధకులుగా మారిన వారు 60 మంది ఉగ్రవాదులు కాగా, కశ్మీర్ లో 91 మంది ఉగ్రవాదులు బోధకులుగా మారారని, ప్రస్తుతం వీరి సంఖ్య 400కి పెరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 150 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు కాగా, మిగిలిన 250 మంది పాకిస్థాన్ తయారు చేసిన స్థానిక ఉగ్రవాద బోధకులని నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు మరింత ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 

More Telugu News