: ఏపీలో వచ్చే నెల 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోలు బంకుల మూత.. మిగతా రోజుల్లో ఒక షిఫ్ట్ మాత్రమే విధులు.. ఆరు దాటితే అంతేసంగతులు!: ఏపీఎఫ్‌పీటీ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 14  నుంచి ప్రతి ఆదివారం పెట్రోలు బంకులు మూతపడనున్నాయి. మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు తెరిచి ఉంటాయి. కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ (సీఐపీడీ) నిర్ణయం మేరకు ఏపీ పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య (ఏపీఎఫ్‌పీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం విజయవాడలో ఆ సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశం పలు నిర్ణయాలు తీసుకున్నారు. మే నుంచి ఆందోళన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. మే 10న ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని, 14 నుంచి ప్రతి ఆదివారం బంకులు మూసివేయాలని సమావేశంలో తీర్మానించారు.

గతేడాది నవంబరులో ముంబైలో సీఐపీడీ, ఏఐపీడీఏ ప్రతినిధులు - భారత్, ఇండియన్, హెచ్‌పీసీఎల్ కంపెనీల మధ్య జరిగిన సమావేశంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. 2011లో అపూర్వచంద్ర కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంతోపాటు ఆయిల్ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలన్న డిమాండ్‌తో వచ్చే నెల నుంచి ఆందోళన నిర్వహించనున్నట్టు గోపాలకృష్ణ తెలిపారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మే 14 నుంచి  ప్రతి ఆదివారం పెట్రోలు బంకులను మూసి వేస్తామని తెలిపారు.

More Telugu News