: బెంగళూరు, హైదరాబాదు జట్ల ఆశలపై నీళ్లు చల్లిన వర్షం

మిగిలిన మ్యాచ్ లలో విజయం సాధించి, టైటిల్ వేటలో మిగలాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సొంత గడ్డపై కాకుండా ఇతర జట్ల వేదికలపై గెలవలేదన్న అపప్రధను తొలగించుకోవాలన్న సన్ రైజర్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఐపీఎల్ సీజన్ 10లో తొలిసారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి చాలా సేపటి ముందునుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంను వర్షం జల్లులు పలకరించాయి.

అనంతరం పలుమార్లు తెరిపిచ్చినట్టే ఇస్తూ, పిచ్ పై కవర్లు తొలగించే సమయానికి మళ్లీ వరుణుడు ప్రత్యక్షమవుతూ ఆటాడుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారింది. ఇక వర్షం తెరిపిచ్చిందని భావించి మ్యాచ్ నిర్వహణకు పరిస్థితులు అంచనా వేసేందుకు అంపైర్లు గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతిసారీ వర్షం వారిని ముంచెత్తింది. దీంతో 11:20 నిమిషాలకు ఐదేసి ఓవర్ల చొప్పున షూటౌట్ నిర్వహించాలని అంపైర్లు భావించారు. అందుకు కూడా పరిస్థితి అనుకూలించకపోవడంతో మ్యాచ్ రద్దైనట్టు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ పంచారు. దీంతో బెంగళూరు అభిమానులు నిరాశకు గురయ్యారు.

More Telugu News