: 'ఈ విలేకరి చొక్కా కాషాయ రంగులో ఉంది..: అంటూ సహనం కోల్పోయిన అఖిలేష్ యాదవ్

మీడియా సమావేశంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహనం కోల్పోయారు.‘ఇలాంటి వాళ్ల వల్లే దేశం నాశనం అవుతోంది.. దేశం నాశనమైతే నువ్వు కూడా ఉండవు’ అంటూ ఓ విలేకరిపై విరుచుకుపడ్డారు. ‘సమాజ్ వాదీ పార్టీ పగ్గాలను మీ తండ్రి ములాయం సింగ్ కు అప్పగించాలని మీ బాబాయి శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన ఏమైంది?’ అని ఆ విలేకరి ప్రశ్నించడంతో అఖిలేష్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో, ‘ఈ విలేకరి చొక్కా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా..మే లో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. ఆ తర్వాత, నా కుటుంబం గురించి ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు’ అని అఖిలేష్ అన్నారు. కాగా, ఓ సీనియర్ జర్నలిస్టుపై కూడా అఖిలేష్ భద్రతా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించింది.

More Telugu News